ఎచ్చెర్ల : వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్కుమార్ అన్నారు. ఫరీదుపేటలో మృతిచెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు సత్తారు గోపి కుటుంబాన్ని పరామర్శించి పార్టీ తరఫున మంజూరైన రూ.2 లక్షల చెక్ను శుక్రవారం అందజేశారు. మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు చెక్కును అందజేశామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మొదలవలస చిరంజీవి, డోల వెంకటరమణ, లీగల్సెల్ అధ్యక్షుడు కోటిపాత్రుని శివకుమార్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
68 వాహనాలు.. రూ.2.01 లక్షలు ఆదాయం
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం పోలీస్, రెవెన్యూ, రోడ్డు రవాణా విభాగాలు సంయుక్తంగా ద్విచక్ర వాహనాల వేలం నిర్వహించాయి. ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ పరిధిలో యజమానులు ఎవరో తెలియని ద్విచక్రవాహనాలు 68 పట్టుబడటంతో ఈ వేలాన్ని నిర్వహించగా జిల్లా నుంచే కాక విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి 27 మంది వేలంలో పాల్గొని రూ.2,01,300లకు వాహన దక్కించుకున్నారని ట్రాఫిక్ సీఐ వి.రామారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఒకటో పట్టణ ఎస్ఐ ఎం.హరికృష్ణ, ఆర్టీవో గంగాధర్, ఆర్ఐ లింగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈదురుగాలులకు నేలకొరిగిన చెట్లు
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలో శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. మర్రిపాడు–సి(మెళియాపుట్టి –నౌపడ రహదారి), పలాస–పూండి రహదారుల్లో ఎక్కడికక్కడ చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మామిడికాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందారు.
డివిజనల్ రైల్వే మేనేజర్ విస్తృత తనిఖీలు
మందస: ఇచ్ఛాపురం–పలాస సెక్షన్లో విశాఖపట్నం అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ కుందు రామారావు మందస మండలంలో హరిపురంలోని మందస రైల్వే స్టేషన్లో శుక్రవారం విస్తృత తనిఖీలు చేశారు. లెవెల్ క్రాసింగ్ గేట్ల స్థానంలో అండర్, ఓవర్ బ్రిడ్జి వంతెనల నిర్మాణానికి తక్షణం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. దిగువ స్థాయి శ్రేణి సిబ్బంది సమస్యలు, ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.
కొబ్బరి చెట్టుపై పిడుగు
పాతపట్నం: పాతపట్నం మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో సుమారు గంట పాటు బీభత్సం సృష్టించింది. ప్రహరాజపాలెంలోని ఎంపీపీ పాఠశాల వెనక ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో మంటల్లో కాలిపోయింది.


