శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) : తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు ఉత్తరాంధ్రకు చేసిన మేలు ఒక్కటైనా ఉందా అని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పలాస కిడ్నీ హాస్పటల్, రిమ్స్ మెడికల్ కాలేజ్, కలెక్టరేట్ నిర్మాణం, హిరమండలం లిఫ్ట్ ఇరిగేషన్, మూలపేట పోర్టు, వంశధార ఫేజ్–2, స్టేజ్–2, ఫిషింగ్ హార్బర్లు వంటి అనేక పనులు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వచ్చి హార్బర్ పనులు నిలిపివేశారని, నరసన్నపేటకు వచ్చి చెత్త నుంచి సంపద సృష్టించడం నేర్పిస్తామంటున్నారని చురకలు అంటించారు. ఈ మాత్రం దానికే జిల్లాకు రావాలా అని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వేదికపై హామీలు ఏం చేశారో చెప్పలేదని, అంతా వైఎస్సార్సీపీపై విమర్శలకే సరిపోయిందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు చెబితే పేదోడి గుండె చప్పుడు, సంక్షేమం, అభివృద్ధి గుర్తుకు వస్తాయని అన్నారు. ఫీజు రీ యింబర్స్మెంట్, రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు రుణమాఫీ, ఉచిత పంటల బీమా ఊసే లేకపోవడం అన్యాయమన్నారు. వైద్యం, విద్యను అందని ద్రాక్షగా మార్చేశారన్నారు. చంద్రబాబు, కూటమి అబద్ధాలను ప్రజలు గమనించాలని కోరారు.


