ఎచ్చెర్ల: ఫరీదుపేట పంచాయతీ పరిధిలోని కోయిరాళ్ల జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం బొలెరో వ్యాన్ బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు వాటర్ బాటిళ్లతో వస్తున్న వ్యాన్ కొయిరాళ్ల జంక్షన్ వద్దకు వచ్చేసరికి టైరు పేలి బోల్తాపడింది. ఆ సమయంలో అటుగా ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వ్యాన్ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెట్రోలింగ్ పోలీసులు, ఎన్హెచ్ఎఐ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని జాతీయ రహదారిపై వాహనాలు మళ్లించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


