అధికారంలోకి రాగానే పాతపట్నం నియోజకవర్గంలో ఐటీడీఏ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం, 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు వాటికి అతీగతి లేదు.
ఆమదాలవలస నియోజకవర్గంలో పురుషోత్తపురం వద్ద వంశధార నదిపై, ముద్దాడ పేట వద్ద నాగావళి నదిపై వంతెనల నిర్మాణాలు పూర్తి చేస్తామని, నారాయణపురం ఆనకట్ట ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం వాటి ఊసే ఎత్తడం లేదు.
నియోజకవర్గానికి ఒక ఇంజినీరింగ్ కళా శాల తీసుకొస్తామని, వంశధార ప్రాజె క్టును పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేస్తామని, జీడి పిక్కల 80కిలోల బస్తా మద్దతు ధర రూ. 16వేలు చేస్తామని హా మీ ఇచ్చారు. జీడి పిక్కల ధర పెంచడం పక్కన పెడితే ఉన్న ధరను తగ్గించేశారు.
ఆఫ్షోర్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని, వంశధార కాలువలకు సిమెంట్ లైనింగ్ పను లు చేస్తామని, పలాసలో రైతు బజారును ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం ఏర్పాటు కాగానే వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేస్తామని, పలాసలో డిఫె న్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. వాటిలో ఒక్కటి కూడా అమలు కాలేదు.
నరసన్నపేట పరిధిలో ఎత్తిపోతల పథకం పూర్తి చేస్తామని, వంశధార–బాహుదా నదుల అనుసంధానం చేస్తామని, కళింగ వైశ్యులను ఓబీసీలో చేర్చుతామని, టెక్కలిలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామని, బుడగట్లపాలెంలో మత్స్యకార జెట్టీ నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారు.


