నరసన్నపేట: జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గతంలో జిల్లాకు రెండు మార్లు వచ్చిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. వారు శుక్రవారం నరసన్నపేటలో విలేకరులతో మాట్లాడారు. వంశధార, టెక్కలి ఆఫ్షోర్ ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇచ్ఛాపురం వరకూ నీరందిస్తామని అన్నారని నిలబెట్టుకోవాలని కోరారు. పైడిగాం ప్రాజెక్టు మరమ్మతు చేయాలని, జీడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, జీడి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చే యాలన్నారు. నరసన్నపేటలో ఉన్న టీడీపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, చెరువులను చెరబడుతున్నారని విమర్శించారు. వంశధార నదిలో ఇసుకను కొల్లగొడుతున్నారని మట్టినీ వదలడం లేదని అన్నారు. నరసన్నపేటకు వస్తున్న చంద్రబాబు జిల్లా సమస్యలపై స్పందించాలని కోరారు.


