● ఉత్సాహంగా సాగుతున్న ఇంటర్నేషనల్ చెస్ పోరు
● ఆంధ్రప్రదేశ్ రేటింగ్ క్రీడాకారులు హవా
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ చెస్ చాంపియన్షిప్ పోటీలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి. సీఎస్ఎన్ ట్రస్ట్, గీతా చెస్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకాకుళం గ్రాండ్ కన్వెన్షన్లో జరుగుతున్న ఈ పోటీలు నువ్వా–నేనా అన్నట్టుగా ఉత్కంఠను తలపిస్తున్నాయి. ఐదురోజుల మెగా టోర్నీలో భాగంగా రెండో రోజు శుక్రవారం మూడో రౌండ్ పోటీలను కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి పోటీలను ప్రారంభించారు. బాలబాలికల ఎత్తుకు పై ఎత్తులను వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళంలో అంతర్జాతీయ స్థాయి చెస్ పోటీలు నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. ఇంతటి భారీస్థాయిలో చెస్ టోర్నీని నిర్వహిస్తున్న కమిటీ ప్రతినిధులను అభినందించారు. దేశ నలుమూలల నుండి విచ్చేసిన క్రీడాకారులకు.. శ్రీకాకుళం విశిష్టతను, గొప్పతనాన్ని ప్రాచీన కట్టడాలను గురించి వివరించారు. కార్యక్రమంలో పోటీల ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ సుధీర్, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు బాగాది కిషోర్, జయరాజ్, వసంతరావు, వివిధ జిల్లాలకు చెందిన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు రౌండ్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు రేటింగ్ ప్లేయర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. వీరికి తమిళనాడు, ఒడిశా, అమెరికాకు చెందిన క్రీడాకారులు గట్టిపోటీనిస్తున్నారని డైరెక్టర్ సనపల భీమారావు తెలిపారు.


