జలుమూరు:
తిమడాం పంచాయతీ కార్యాలయానికి ఆనుకు ని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వెలమల చంద్రభూషణరావు ఆక్రమించారని ఎంపీటీసీ సభ్యుడు వెలమల అసిరినాయు డు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ జెన్ని రామారావుకు గురువారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. సర్వే నంబర్ 85లో మూడో నంబర్ గ్రామ కంఠంగా ప్రభుత్వ రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ తనకు అనుకూలంగా రికార్డులు మార్చుకున్నాడని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామంలో ప్రభుత్వ భూములను టీడీపీ నాయకులు ఆక్రమిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యాలయం చుట్టూ ఆలయాలు ఉన్నాయని, మధ్యలో ఈ భూమి ఈ టీడీపీ నాయకునికి ఎలా సంక్రమించిందో అధికారులు నిగ్గు తేల్చాలన్నారు. ఇటీవల చెరువును కూడా మరో టీడీపీ నాయకుడు ఆక్రమించగా పోరాటం చేసి అడ్డుకున్నామని, అలాగే తాగునీటి టాంక్ నుంచి ప్రజలకు అందాల్సిన నీటిని కూడా తన పొలాలకు పైపులు ద్వారా మళ్లిస్తే వాటిని కూడా అడ్డుకున్నామని వివరించారు. దీనిపై తహసీల్దార్ జెన్ని రామారావు వివరణ కోరగా ఇప్పటికే అధికారులను పంపించామని, ప్రభుత్వ భూమి అని తేలితే వాటిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.


