శ్రీకాకుళం : జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 18న హుండీ కానుకల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఆలయ ఉప కమిషనర్, కార్యనిర్వహణాధికారి కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. దేవాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు, గ్రామపెద్దల సమక్షంలో హుండీలను తెరిచి కానుకలను లెక్కిస్తామని తెలిపారు.
రణస్థలం : లావేరు మండలం రావివలస జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం 5 గంటల సమయంలో శ్రీకాకుళం వైపు నుంచి విశాఖపట్నం వైపు బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 13 పశువులను లావేరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై కె.అప్పలసూరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీకాకుళం క్రైమ్ : ఇచ్ఛాపురం, టెక్కలి, కోట బొమ్మాళి ఎకై ్సజ్ స్టేషన్ల పరిధిలో 15 కేసుల్లో పట్టుబడిన 261 కిలోల గంజాయిని విశాఖ జిల్లా భీమునిపట్నం కాపులుప్పాడ గ్రామంలో జిందాల్ అర్బన్ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ సమీపంలో ధ్వంసం చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి తిరుపతినాయుడు తెలిపారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్, డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ డి.శ్రీకాంత్రెడ్డి సమక్షంలో ధ్వంసం చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, పి.రామచంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఆమదాలవలస : గాజులకొల్లివలస గ్రామానికి చెందిన వెలమరెడ్డి రాకేష్ (25) అనే యువకుడు బుధవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సనపల బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. తండ్రి లేని రాకేష్ తన తల్లి మంగమ్మతో కలిసి గాజులకొల్లివలసలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి తల్లితో ఇంటి విషయంలో గొడవ జరిగింది. దీంతో మనస్థాపానికి గురై ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే వెంటనే కిందకు దించి జొన్నవలస సీహెచ్సీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి మేనమామ కంచర్ల శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
ఆమదాలవలస: మండలంలోని తోటాడ గ్రామానికి చెందిన యువ పరిశోధకుడు తమ్మినేని సంతోష్ కుమార్ అరుదైన ఘనత సాధించి గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఇటీవల విడుదలైన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎపీపీఎస్సీ) డిగ్రీ లెక్చరర్ పరీక్షా ఫలితాలలో కామర్స్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. సాధారణ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన సంతోష్ కుమార్ కష్టపడి చదువుతూ ఉన్నత లక్ష్యాలను సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఇటీవలే ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ పరిశోధనను సమర్పించారు.
అకడమిక్ రంగంలోను పోటీ పరీక్షల్లోనూ ఒకేసారి ప్రతిభ కనబరిచిన ఆయన విజయంపై గ్రామ ప్రజలు అధ్యాపకులు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సాధించిన ఈ ఘనతతో తోటాడ గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.


