అత్యాశకు పోతున్న కొందరు
వ్యాపారులు
మామిడి పండ్లను మగ్గబెట్టేందుకు
రసాయనాల వినియోగం
ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యుల హెచ్చరిక
బాగా శుభ్రం చేయాలి
నిగనిగ..
హిరమండలం: వేసవి కాలం అంటే మామిడి పండ్ల సీజన్. చూడగానే నోరూరుంచే మామిడి పండ్లను ఇష్టపడని వారంటూ ఉండరు. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ వీటి రుచికి ఫిదా అవుతుంటారు. ఈ కాలంలో చాలామందికి మామిడి పండ్ల విక్రయాలే జీవనాధారం. రోడ్ల పక్కన, షాపుల్లో, తోపుడు బండ్లపై విక్రయాలు జరుగుతూ ఉంటాయి. అయితే లేత పసుపు రంగులో మెరిసిపోతూ కనిపించే మామిడి పండ్ల వెనుక అనారోగ్యం కూడా దాగుంది. కొందరు వ్యాపారులు అత్యాశతో రసాయనాలతో పండ్లను మాగబెట్టి విక్రయిస్తున్నారు. దీనివల్ల రంగు చాలా బాగా కనిపిస్తుంది. చూడగానే ప్రజలు వాటిని కనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కానీ వాటిని తింటే మాత్రం అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉంది. కొన్నిచోట్ల ఎలాంటి లైసెన్సులు లేకుండా పండ్లను మగ్గబెట్టే కేంద్రాలను నిర్వహిస్తు్ాన్న.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిబంధనలు ప్రకారం వ్యాపారులు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మామిడి కాయలు తీసుకొచ్చి రసాయనాలతో పండిస్తూ యథేచ్ఛగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు.
రోగాలు వచ్చే ప్రమాదం
కార్బైడ్తో మాగబెట్టిన పండ్లను తింటే అల్సర్, నాడి, కాలేయం, చర్మం సంబంధిత వ్యాధులు వస్తాయని ప్రభుత్వ వైద్యాధికారులు చెబుతున్నారు. చిన్నారులకు అనారోగ్యం కలుగుతుందన్నారు. గర్భిణులు ఈ పండ్లు తింటే పుట్టబోయే శిశువులకు జన్యుపరమైన లోపాలు, అనారోగ్యం, ఫిట్స్, జ్ఞాపక శక్తి తగ్గడం, చర్మంపై దద్దురులు రావడం, నల్ల బడడం, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
కృతిమంగా పండించిన పండు అంతా ఒకే రంగు కలిగి ఉంటుంది. కోసినప్పుడు లోపలి కొంతభాగం పక్వంగాను, మిగతా సగం అపరిపక్వంగా ఉండి సరైన రుచి లేకుండా ఉంటుంది. అందువలన పండ్లను నీటితో బాగా శుభ్రం చేసి తొక్కను తీసితింటే కొంతవరకు రసాయనాల ప్రభావం తగ్గుతుంది.
– పి.సాయికుమార్,
వైద్యాధికారి, పీహెచ్సీ హిరమండలం


