పొందూరు:
స్థానిక పోస్టాఫీసులో పార్శిల్ ప్యాకింగ్ యూనిట్(పీపీయూ) ద్వారా హోమ్ డెలివరీ సదుపాయాన్ని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వి.హరిబాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్టమర్లకు పోస్టల్ డిపార్టమెంటల్ లోగోతో పార్శిల్స్ సురక్షితంగా చేరుకుంటాయని చెప్పారు. సోంపేట, పాలకొండ, కాశీబుగ్గ, టెక్కలి, ఆమదాలవలస, శ్రీకాకుళం హెచ్వో, రాజాం పోస్టాఫీసుల్లోనూ పీపీయూ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రైవేట్ కొరియర్ల కంటే మెరుగైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలను పోస్టాఫీసుల్లో అందజేస్తామని పేర్కొన్నారు. 4 రకాల పార్శిల్స్ బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉందని చెప్పారు. రూ.22ల నుంచి రూ.185ల వరకు పార్శిల్ ధరలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉచిత ఆధార్, బయోమెట్రిక్ సేవలు
పోస్టాఫీసుల్లో 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ఆధార్, బయోమెట్రిక్ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నూతన ఆధార్ కార్డుల సేవలతో పాటు ఆధార్, బయోమెట్రిక్ సేవల్లో సాంకేతిక సమస్యలను తీర్చడానికి, నిరంతరం సేవలు అందించేందుకు పోస్టాఫీసుల్లో ప్రభుత్వం ఆధార్ కేంద్రాలను తెరిచిందన్నారు. 15 ఏళ్లలోపు పిల్లల ఆధార్, బయోమెట్రిక్ అప్డేట్ చేసుకునేందుకు విధిగా తల్లిదండ్రులతో మాత్రమే పోస్టాఫీసులకు రావాలని సూచించారు. ఆయనతో పాటు సబ్ పోస్టు మాస్టర్ ఎం.ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు.


