అంగనాడీల సమస్యలు పరిష్కరించాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్:
అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతామని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్ అమ్మన్నాయుడు, పి.తేజేశ్వరరావు, ఎ.పి.అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.సుధ అన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26000 ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమీపంలోని మహాత్మా జ్యోతిబా పూలే పార్కు వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్–హెల్పర్స్ సీఐటీయూ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఐసీడీఎస్కు బడ్జెట్, అంగన్వాడీలకి వేతనాలు పెంచాలని కోరుతూ మార్చి 2న విజయవాడలో జరిగే మహా ధర్నాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షలకు ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అమరావతి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, ఎన్.వి రమణ, ఆర్.ప్రకాశరావు, ఎం. గోపి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ – హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎన్.హైమావతి, బి.జ్యోతి, కె.మాధవి, పి.భూలక్ష్మి, బి.సునీత, బి.రమణమ్మ, బి.హైమావతి, బి.ఆదిలక్ష్మి, కె.రాధిక, వై.విజయలక్ష్మి, కె.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.


