మరింత ముందుకు మహిళా క్రికెట్
● మహిళా క్రికెట్ అభివృద్ధికి జిల్లా క్రికెట్ సంఘం కృషి
● శ్రీకాకుళంలో టర్ఫ్ వికెట్, నెట్స్ ప్రారంభం నేడు
శ్రీకాకుళం న్యూకాలనీ: మహిళా క్రికెట్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జిల్లా క్రికెట్ సంఘం(జెడ్సీఎస్) నడుం బిగించింది. మహిళా క్రికెటర్లను ప్రోత్సహించేందుకు జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేశారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) తోడ్పాటుతో శ్రీకాకుళం ఎన్టీఆర్ నగరపాలకోన్నత పాఠశాల మైదానంలో మహిళా క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు అత్యాధునిక హంగులతో టర్ఫ్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్లు ఏర్పాటు చేశారు. క్రికెట్ కార్యకలాపాలను నిర్వహించేందుకు చిన్న కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ క్రికెట్ నెట్స్ను ఆదివారం ప్రారంభించేందుకు జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు.
మెరుపులు లేమితో..
జిల్లాకు చెందిన పలువురు క్రీడాకారిణులు జోనల్ స్థాయి, రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్ వరకు వెళ్తున్నప్పటికీ అంతర్రాష్ట్ర, జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో నిలదొక్కుకునేలా రాణించలేకపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ఆది నుంచి మహిళా క్రికెట్పై బాలికల తల్లిదండ్రుల్లో ఆసక్తి లేకపోవడం, క్రికెట్ సంఘాల ప్రతినిధుల ప్రేక్షకపాత్ర, టర్ఫ్వికెట్ వంటి నాణ్యమైన వసతులు, సౌకర్యాలు కల్పించకపోవడం తదితర కారణాలతో ఎలాంటి మెరుపులు లేకపోయాయి. జిల్లా నుంచి కేవీఎస్పీ చందన, హారిక యాదవ్, బి.నవ్య, కుమూదిని రాష్ట్రస్థాయి వరకు ఆడగలిగారు. జాహ్నవి, వనజాక్షి స్టేట్ ప్రాబబుల్స్ వరకు ఎంపికయ్యారు.
ఆధునిక హంగులతో నెట్స్..
తాజాగా ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటుచేసిన క్రికెట్ నెట్స్ వద్ద అత్యాధునిక వసతులు, సౌకర్యాలు కల్పించారు. రెండు వికెట్లతో కూడిన నెట్స్ ఏర్పాటు చేశారు. ఫ్లడ్ లైట్లను అమర్చారు. నెట్స్ వద్ద సాధనకు హాజరయ్యే క్రీడాకారిణులకు ఇబ్బంది లేకుండా డ్రెస్సింగ్ రూమ్, రెస్ట్ రూమ్లను నిర్మించారు. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4.30 నుంచి 7.30 వరకు శిక్షణ అందించనున్నారు. కనీసం 10 ఏళ్లు పైబడి క్రికెట్పై ఆసక్తి కలిగిన బాలికలు ఈ నెట్స్ వద్దకు సాధనకు అవకాశం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇద్దరు మహిళా క్రికెట్ కోచ్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఫిట్నెస్ను మెరుగుపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో మహిళా క్రికెట్ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టాం. తాజాగా అన్ని హంగులతో కూడిన నెట్స్ను శ్రీకాకుళం నగరం మధ్యలో ఏర్పాటు చేశాం.
– ఇలియాస్ మహ్మద్, సీనియర్ ప్లేయర్, జిల్లా క్రికెట్ సంఘం మెంటార్
బాలికల క్రికెట్ను విస్తరించాలని జెడ్సీఎస్ సంకల్పించింది. శిక్షణకు హాజరయ్యే మహిళలకు, బాలికలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. డ్రెస్సింగ్రూమ్ను, రెస్ట్రూమ్లను ఏర్పాటు చేశాం. అన్ని వసతులు, సౌకర్యాలతో నెట్స్ సిద్ధం చేశాం.
– మదీనా శైలానీ, సీనియర్ ప్లేయర్, జిల్లా క్రికెట్ సంఘం కోశాధికారి
మరింత ముందుకు మహిళా క్రికెట్
మరింత ముందుకు మహిళా క్రికెట్
మరింత ముందుకు మహిళా క్రికెట్
మరింత ముందుకు మహిళా క్రికెట్


