
వరదొస్తే పల్లెలకు ముప్పు
● అడ్డుకట్టలతో నీటి మళ్లింపు
ఈ చిత్రం చూడండి. ఇసుకను లారీల్లో రవాణా చేసేందుకు నదిలో ప్రవహిస్తున్న నీరు అడ్డొస్తుందని పెద్ద పెద్ద పైపులను కింద పెట్టి, పైన గ్రావెల్తో గట్టు నిర్మించారు. ఆ గట్టు కింద నున్న పైపుల ద్వారా నీరు మళ్లించేలా చర్యలు తీసుకున్నారు. వాస్తవంగా నదిలో యంత్రాలతో ఎలాంటి పనులు చేపట్టకూడదు. కానీ పట్టించుకోకుండా ఇష్టారీతిన ఇసుక నిర్వాహకులు వ్యవహరిస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
వానలు పడుతున్నా.. నదుల్లోకి నీరు వస్తున్నా జిల్లాలో ఇసుక తవ్వకాలు ఆపడం లేదు. తరలింపు ఆగడం లేదు. ప్రభుత్వం అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. ఇసుక డబ్బుల కోసం గ్రామాలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. నేతల జేబులు నింపడానికి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టేస్తోంది. ఎవరేమైనా ఫర్వాలేదు తమ ఖజానా నిండితే చాలు అన్నట్టుగా పచ్చనేతలు చెలరేగిపోతున్నారు.
ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వంశధార నదిలోకి వరద నీరు వస్తోంది. దీంతో నీటి ప్రవాహం మొదలైంది. ఈ పరిణామం ఇసుక అక్రమార్కులకు రుచించడం లేదు. వరదలొచ్చి తమకొచ్చే ఆదాయాన్ని గండికొడుతోందని, ఊరకనే వచ్చే సొమ్మును కోల్పోతున్నామని తెగ బాధపడిపోతున్నారు. నదిలోకి నీరొస్తే తవ్వకాలకు ఇబ్బందని, లారీలతో తరలించేందుకు కష్టమవుతుందని మదనపడిపోతున్నారు. ఏం జరిగినా ఇసుక తవ్వకాలు ఆగకూడదు, రవాణా ఆపకూడదన్న నిర్ణయానికొచ్చి బరితెగింపునకు దిగారు. తవ్వకాలు జరిగే చోటుకి వరద నీరు రాకుండా ఉండటానికి నదీ ప్రవాహానికి మధ్యలో యుద్ధ ప్రాతిపదికన గట్టు నిర్మించారు. అంతేకాకుండా భారీ ట్రక్కుల ద్వారా ఇసుక రవాణా చేసేందుకు ఇబ్బంది వస్తుందని నదిలోనే నీటి ప్రవాహానికి అడ్డంగా పైపులతో మరో గట్టు నిర్మించారు. ఇవన్నీ యంత్రాలతోనే చేసేశారు. వాస్తవంగా నదిలో యంత్రాల ద్వారా ఎలాంటి పనులు చేపట్టకూడదు. పర్యావరణానికి హాని కలిగించే ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. కానీ, ఇక్కడి నిర్వాహకులు తమకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఒక లెక్కా తాము చేసిందే న్యాయం అన్నట్టుగా నదిలో అడ్డంగా నిర్మాణాలు చేపట్టారు.
వరద ఉద్ధృతి పెరిగితే ఆ గ్రామాలకు ముప్పే..
నదిలో అడ్డంగా పొడవైన గట్లు నిర్మించడం వలన భారీ వర్షాల కారణంగా వరదలొస్తే దిగువ ప్రాంతాలకు ముప్పు వాటిల్లుతుంది. వరద ఉద్ధృతికి ఆ గట్లు తెగిపడితే తీర ప్రాంత గ్రామాలు ముంపు బారిన పడక తప్పదు. ఇప్పటికే ఇసుక తవ్వకాలతో నదీ గమనం మారిపోయింది. పైపెచ్చు నదిలో అడ్డంగా పొడవైన గట్లు నిర్మించడం వల్ల ప్రవాహ గమనం మారిపోతుంది. అదే జరిగితే పెను ప్రమాదం చోటు చేసుకున్నా ఆశ్చర్య పోనక్కర్లేదు. గార వద్ద జరుగుతున్న ఇసుకాసురుల దుశ్చర్యల వల్ల లోతట్టు ప్రాంతాలైన వమరవల్లి, తోనంగి, క ళింగపట్నం, మత్స్యలేశం, బందరవానిపేట, కొర్ని పంచాయతీలకు ముప్పు ఉండే అవకాశం ఉంది.
ఇసుక అక్రమ తవ్వకాలతో ముప్పులో
తీర ప్రాంత గ్రామాలు
అక్రమ సొమ్ము కోసం గార తీరంలో అడ్డదారులు
వరదల వేళ వంశధార నదిలో అడ్డంగా కరకట్ల నిర్మాణం
తవ్వకాలు జరిపే చోటుకి నీరు రాకుండా గట్లు వేసిన అక్రమార్కులు
వర్షాకాలం నేపథ్యంలో భయాందోళనలో తీర ప్రాంత గ్రామ ప్రజలు

వరదొస్తే పల్లెలకు ముప్పు