
మా బడి మాకు కావాలి
మందస: తమ బడి తమకు కావాలని మందస మండలం హొన్నాళి గ్రామ ప్రజలు రోడ్డెక్కారు. హొన్నాళి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాల నుంచి 6, 7, 8 తరగతులను సిరిపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు గురువారం పాఠశాల ఎదురుగా ఆందోళన నిర్వహించారు. ఎలాంటి బస్సు సౌకర్యం లేని పరిస్థితుల్లో పిల్లలను ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి ఎలా పంపించాలని ప్రశ్నించారు. సిరిపురం వెళ్లే దారిలో రిజర్వ్ ఫారెస్టు ఉందని, సాయంత్రం, చీకటి పడే సమయాల్లో అడవి జంతువులు తిరుగుతాయని అలాంటి దారిలో పిల్లలు ఎలా రాకపోకలు సాగించగలరని అన్నారు. ఇదే దారిలో మహేంద్ర తనయ నది ఉందని, దానిపై రక్షణ లేని వంతెన ఉందని, దాన్ని దాటడం పిల్లలకు ప్రమాదకరమని వివరించారు. హొన్నాళి గ్రామంలో ఎంపీయూపీ విద్యార్థులు దాదాపు 100 మంది ఉన్నారు. అందులో యూపీ విద్యార్థులు 42 మంది ఉన్నారు. వీరితో పాటు నారాయణపురం స్కూల్ను కూడా హరిపురం హైస్కూల్లో విలీనం చేశారు. ఈ రెండు స్కూళ్ల మధ్య దూరం ఐదు కిలోమీటర్లు. దారిలో జీడితోటలు ఉన్నాయి. ఎలుగు బంట్ల సంచారం ఉంటుంది. దీనిపై నారాయణపురం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హొన్నాళిలో రోడ్డెక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు
స్కూళ్ల విలీనంపై ఆగ్రహం
ఎలా పంపించగలం..?
6, 7, 8 తరగతుల వారు సిరిపురం వరకు వెళ్లాలంటే ఐదు కిలోమీటర్లు ప్రయాణించాలి. ఎలాంటి బస్సు సదుపాయం లేదు. విద్యా ర్థులు సైకిళ్లపైనే వెళ్లాలి. ఆ దారిలో వంతెనపై నుంచి వానాకాలంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ఎలా స్కూల్కు పంపించగలం. – నోయానో శెట్టి, హొన్నాళి
విలీనం సరికాదు
గ్రామంలో ఉన్న బడిని వేరే పాఠశాలలో విలీనం చేయడం సరికాదు. పిల్లలను బయటకు పంపాలంటే మాకు భయంగా ఉంటుంది. మా బడి మాకు కావాలి.
– జ్యోతి మాలిక్, విద్యార్థి తల్లి హొన్నాళి

మా బడి మాకు కావాలి

మా బడి మాకు కావాలి