
బిల్లూ లేదు!
ఇల్లూ
లేదు..
● పేదలకు ఇళ్లు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం
● సొంత స్థలంలో నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు చెల్లించని వైనం
● లబ్ధిదారులకు తప్పని ఎదురుచూపులు
● జగనన్న కాలనీలో కానరాని వసతులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: కూటమి ప్రభుత్వం పేదలకు రిక్తహస్తం చూపిస్తోంది. ఎన్నికల హామీలు నెరవేర్చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంటోంది. ఏ ప్రభుత్వమైనా పేదలకు ప్రధానంగా కూడు, గూడు, గుడ్డ అందించాలని భావిస్తుంటుంది. కూటమి సర్కారు మాత్రం అందుకు భిన్నంగా పేదల ఆశలపై నీళ్లు చల్లుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ జిల్లాలో ఒక్క పేద కుటుంబానికి కొత్తగా ఇల్లు మంజూరు చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఎక్కడా ఎవరికీ సెంటు భూమి ఇవ్వలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇల్లు నిర్మాణాలు, బిల్లుల విషయం సైతం పట్టించుకోకపోవడంతో నిర్మాణాలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి.
నెరవేరని హామీ..
ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్లకు తక్కువ లేకుండా ఇళ్ల స్థలం, కనీసం రూ.4 లక్షల నిధులు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ మాట మర్చిపోయారు. ఈ విషయమై ఎవరైనా ప్రశ్నిస్తే.. ఇంకా సమయం ఉందని, అన్నీ అమలు చేస్తామని అడ్డగోలు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప ప్రజలకు మేలు చేయడం లేదు.
వైఎస్సార్సీపీ హయాంలో..
గత ప్రభుత్వంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్ రెడ్డి వలంటీర్లు ద్వారా ఇంటింటా సర్వేలు నిర్వహించి, అర్హత గల ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు మంజూరు చేశారు. స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మాణం చేసేందుకు, స్వంత స్థలం లేని పేదలకు ప్రభుత్వం రైతుల నుంచి భూమి కొనుగోలు చేసి వారికి పట్టాలను అందజేసి ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. జిల్లాలో 30 మండలాలు, నాలుగు పురపాలక సంఘాల పరిధిలో మొత్తం 80,691 ఇళ్లు మంజూరు చేశారు. ఇందుకు గాను 784 లేఅవుట్లను ఏర్పాటు చేశారు. ఇల్లు కట్టుకున్నందుకు స్థలం లేని పేదలకు ఆ లేఅవుట్స్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి, నిర్మాణానికి నిధులు కూడా విడుదల చేసింది. ఇలా నిరుపేదలకు గూడుని ఇచ్చి వారికి సమాజంలో హోదా ఉండేలా చేసింది. జిల్లాలో 33,123 ఇళ్ల నిర్మాణాలు చేపట్టింది. మిగిలిన వారికి నిర్మాణం చేసుకొనేందుకు మూడు ఆప్షన్లు ఇచ్చి స్వయంగా కట్టుకునేవారికి కావాల్సిన మెటీరియల్, నగదు సైతం అందజేశారు. కట్టుకోలేని పేదలకు నేరుగా ప్రభుత్వమే ఏజెన్సీలను ఏర్పాటు చేసి వారి ద్వారా నిర్మాణాలు చేయించి గృహ ప్రవేశాలు సైతం పూర్తి చేసింది. ఇక స్థలం ఉండి కట్టుకునే వారికి జిల్లాలో 43,568 ఇళ్లు మంజూరు చేసింది. వారికి ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. ఇలా గత ప్రభుత్వంలో 36,780 ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, నిర్మాణదారులకు రూ.863.19 కోట్లు అందజేసింది.
కూటమి పాలనలో..
కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది. జిల్లాలో ఒక్క నిరుపేద కుటుంబాలనికి మచ్చుకై నా ఒక్క ఇల్లు మంజూరు కాలేదు. ఇక లే అవుట్ల సంగతి సరేసరి. ఎక్కడా పేదల ఇళ్ల కోసం సెంటు భూమి కూడా కొనుగోలు చేయలేదు. అంతా కక్షసాధింపులు, నాయకుల ఆర్భాటాలు తప్ప సంక్షేమం ఊసేలేదు. స్థలం ఉంది ఇల్లు మంజూరు చేయాలని వేడుకుంటున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
వసతులేవీ?
గత ప్రభుత్వం చివరిలో నిర్మాణాలు చేసిన వారికి కూడా ఈ ప్రభుత్వం బిల్లులు అందజేయలేదు. దీంతో లబ్ధిదారులు కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జిల్లాలో ఏర్పాటు చేసి అన్ని లేఅవుట్ కాలనీకు విద్యుదీకరణ చేశారు. అవసరం మేరకు కొత్తగా సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి నిరంతరం విద్యుత్ అందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి కాలనీలో బోరు బావులు వేయించారు. మోటారుని ఏర్పాటు చేసి తాగునీటి సమస్య లేకుండా చేశారు. అయితే ఎన్నికలు దగ్గర పడటంతో రోడ్లు, కాలువల నిర్మాణానికి బ్రేక్ పడింది. కొత్త ప్రభుత్వం పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆయా కాలనీవాసులు జిల్లా అధికారులకు, కూటమి నాయకులను వేడుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు.