ధర్మవరం: నేతన్న సేవలో, నేతన్న పింఛన్లలో చేనేత కార్మికులకు అన్యాయం చేశారని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు ధ్వజమెత్తారు. పట్టణంలోని మార్కెట్యార్డులోనున్న చేనేత హ్యాండ్లూమ్ కార్యాలయం వద్ద శనివారం సీపీఐ నాయకులు, చేనేత కార్మిక సంఘం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణలు మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఉపశమనం అందించే విధంగా నేతన్న సేవలో పథకాన్ని ఆగస్టు 7న ప్రారంభించారన్నారు. కానీ అర్హుల ఖాతాలో డబ్బులు పడకపోవడంతో చేనేత కార్మికులు నిరాశకు గురయ్యారని తెలిపారు. అర్హులకు ఖాతాల్లో జమ చేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు తేదీలు చెబుతున్నారే గానీ ఇంత వరకూ డబ్బులు వేయలేదన్నారు. ప్రస్తుతం చేనేత పింఛన్లలో మరోసారి అవినీతి అక్రమాలకు అధికారులు తెరలేపారన్నారు. ఇప్పటికై నా జిల్లాస్థాయి అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని నిజమైన చేనేత కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నిరసనలో సీపీఐ పట్టణ కార్యదర్శి రవికుమార్, ఎర్రంశెట్టి రమణ తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు 1,320
అనంతపురం న్యూ టౌన్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ బూత్ల వివరాలను జిల్లా పరిషత్ అధికారులు విడుదల చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ ఆమోదం లభించిన జాబితాను మీడియాకు వెల్లడించారు. జిల్లాలోని 32 మండలాలలో మొత్తం 397 మండల ప్రాదేశిక సభ్యులను ఎన్నుకోనున్నారు. ఇందుకు గాను జిల్లావ్యాప్తంగా 1,320 పోలింగ్ స్టేషన్లను తుదివిడతగా గుర్తించినట్లు జిల్లా పరిషత్ అధికారులు వివరించారు.


