● భార్య మృతి.. భర్త గల్లంతు
గుంతకల్లుటౌన్: జీవితంపై విరక్తితో వృద్ధ దంపతులు హంద్రీ–నీవా కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో భార్య మృతదేహం లభ్యం కాగా.. గల్లంతైన భర్త కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల కథనం మేరకు... కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెలడోణ గ్రామానికి చెందిన సోమలింగమ్మ (60), సీతానంద(64) దంపతులు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరు కుమారుడు నారాయణ వద్ద ఉంటున్నారు. వీరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుంతకల్లులో ఆస్పత్రికి వెళ్తున్నామని ఇంటి నుంచి వచ్చిన వీరు బస్సులో కసాపురం చేరుకున్నారు. అక్కడి నుంచి హంద్రీ–నీవా కాలువ వద్దకు వెళ్లి నీటిలో దూకారు. నీటిలో తేలియాడుతున్న సోమలింగమ్మను స్థానికులు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. నీటిలో గల్లంతైన సీతానంద కోసం గాలింపు చేపట్టారు. దంపతులు అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కసాపురం ఎస్ఐ వెంకటస్వామి తెలియజేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.


