పావగడ: స్థానిక స్వర్ణ శనీశ్వరాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రావణ బహుళ పాడ్యమి శనివారం నిర్వహించిన తృతీయ శ్రావణ శనివారోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి జరిగిన పంచామృతాభిషేకం, తైలాభిషేకం, నవగ్రహ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. దీక్ష మంటపంలో శనీశ్వరుడికి తలనీలాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. స్వామి దర్శనానికి ఈ సారి భక్తులు అధిక సంఖ్యలో రావడం విశేషం. భక్తులు అగ్ని గుండంలోకి నల్ల వస్త్రాలు, నువ్వుల నూనె, నవ ధాన్యాలు సమర్పించి టెంకాయలు కొట్టి పూజలు చేశారు. రెండోశ్రావణ శనివారం హిందూపురానికి చెందిన లోకేశ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వ్యాపారంలో లాభాలు రావడంతో శనీశ్వరస్వామికి కేజి బంగారాన్ని కానుకగా అందించి, మొక్కు చెల్లించుకున్నాడు.
నేత్ర పర్వం..పూల పల్లకీ ఉత్సవం
స్థానిక శనీశ్వరాలయంలో నిర్వహించిన మూడో శ్రావణ శనివారోత్సవం సందర్భంగా విశేష పూల పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పూల పల్లకీని వివిధ రకాల పూలతో అలంకరించారు. జేష్ట్యాదేవి, శనీశ్వరస్వామి విగ్రహాలను నెలకొల్పి భక్తులు పూల ఉత్సవం నిర్వహించారు.


