పెనుకొండ (సోమందేపల్లి): శ్మశానానికి దారి చూపాలంటూ సోమందేపల్లి మండలం తుంగోడు పంచాయతీ కొనతట్టుపల్లి గ్రామానికి చెందిన పలువురు గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద మృతదేహంతో ధర్నా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే... కొనతట్టుపల్లికి చెందిన మాల నారాయణప్ప గురువారం మృతి చెందాడు. కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని పూడ్చడానికి శ్మశానానికి తీసుకువెళ్తుండగా... శ్మశానానికి దారి ఇది కాదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో నారాయణప్ప కుటుంబీకులతో పాటు స్థానిక సీీపీఐ నాయకులు బాలస్వామి, రాజ్గోపాల్, నారాయణస్వామి, చాంద్బాషా తదితరులు మృతదేహంతో తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా చేశారు. శ్మశానానికి దారి చూపాలని డిమాండ్ చేశారు. అయితే వారి సమస్యకు పరిష్కారం చూపాల్సిన అధికార కూటమి పార్టీల వారితో వాగ్వాదం చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చగా.. తహసీల్దార్ మారుతి, పోలీసులు తక్షణ చర్యలు చేపట్టారు. నారాయణప్ప మృతదేహాన్ని తిరిగి గ్రామానికి పంపి, రస్తా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. దీంతో నారాయణప్ప కుటుంబీకులు దహన సంస్కారాలు పూర్తి చేశారు.
శ్మశానానికి దారి చూపాలని డిమాండ్


