పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన పుట్టపర్తిని హరిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా సోమవారం పుట్టపర్తిలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. గణేష్ కూడలి నుంచి ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు అధికారులు, విద్యార్థులతో కలసి 330 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో మొక్కల పాత్ర చాలా కీలకమన్నారు. జిల్లా వ్యాప్తంగా అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు, అధికారులు, విద్యార్థులు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. మొక్కలకు మనం రక్షణ ఇస్తే అవి మనకు రక్షణ ఇస్తాయన్నారు. అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ చక్రపాణి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, డీఈఓ కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్కుమార్


