ప్రశాంతి నిలయం: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 15న పుట్టపర్తిలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బ్రాహ్మణపల్లి సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభా స్థలిని సోమవారం కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. సీఎం, కేంద్ర మంత్రి పర్యటనలో ఎలాంటి లోటు పాట్లు తలెత్తరాదన్నారు. హెలీప్యాడ్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. హెలీప్యాడ్ నుంచి రూట్ మ్యాప్లను పక్కాగా సిద్దం చేయాలన్నారు. నిరంతర విద్యుత్, సౌండ్ సిస్టం, ఎల్ఈడీ స్క్రీన్లు, ఏర్పాటు చేయాలన్నారు. శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ మౌర్య భరద్వాజ్, ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి, అన్ని శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


