ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆధ్యాత్మిక వైభవాన్ని, పౌరాణిక విశిష్టతను వివరిస్తూ నిర్వహించిన సాంస్కృతిక భక్తి రస కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సత్యసాయి భక్తులు రెండోరోజు ఆదివారం సాయి కుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహా సమాధి చెంత సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఉదయం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సత్యసాయి యూత్ సంగీత విభావరి నిర్వహించింది. ఈ సందర్భంగా వారు చక్కటి భక్తి గీతాలతో ఆకట్టుకున్నారు. సాయంత్రం ‘చిత్త రోగానికి చికిత్స ఎక్కడ ’అన్న పేరుతో నృత్య నాటిక నిర్వహించారు. సత్యసాయి తన జీవిత గమనంలో భక్త కోటికి తలెత్తే ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక సమస్యలకు పరిష్కారం చూపించిన విధానాన్ని వివరించారు. అనంతరం అదిలాబాద్ భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు.


