అగళి: వరుణుడి కరుణ కోసం గ్రామాల్లో వింత ఆచారాలను పాటిస్తున్నారు. కప్పలు, గాడిదల పెళ్లిళ్లు, ఊరి నుంచి వలస వెళ్లడం, బండరాయిపై నైవేద్యాన్ని నాలుకతో నాకడం లాంటివి చేస్తుంటారు. ఇందులో భాగంగానే అగళి మండలం నరసంబూదిలో ఓ ఆచారాన్ని పాటిస్తున్నారు. గ్రామంలోని పిల్లలు చెరువులోని మట్టిని సేకరించి దాన్ని విగ్రహంగా తయారు చేశారు. గ్రామంలోని ఇంటింటికీ వరుణ దేవుడు (మండ్రయ) విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ప్రతిమ ఎత్తుకున్న వారిపై నీరు పోసి ధాన్యాన్ని సేకరించారు. కార్యక్రమం మొత్తం పూర్తయిన తర్వాత ఆ విగ్రహాన్ని చెట్టు కింద కొలువుదీర్చి ధాన్యంతో భోజనాలు చేసి భక్తులకు అన్నదానం చేశారు. ఇలా చేస్తే వరుణ దేవుడు కరుణించి వర్షం కురుస్తుందని గ్రామ పెద్దలు చెబుతున్నారు.
మట్టి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకొని ఇంటింటికీ వెళ్లి ధాన్యాన్ని సేకరిస్తున్న పిల్లలు


