గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమజ్జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, మంటపారాధన, పంచగవ్యప్రాశన, గోపూజ, సుందరకాండ, మన్యుసూక్త పారాయణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి తమలపాకులతో లక్షార్చన నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. రెండో రోజు సోమవారం ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఉత్సవ మూర్తికి సింధూరంతో లక్షార్చన పూజను నిర్వహించి తీర్థప్రసాదాల పంపిణీ చేయనున్నారు. చివరిరోజు మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం ఉత్సవ మూర్తికి లక్ష పుష్పాలతో అర్చన చేసి పూర్ణాహుతితో ఉత్సవాలు ముగించనున్నారు.


