అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో శుక్రవారం టన్ను మామిడికాయలు గరిష్టంగా రూ.52 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 420 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.52 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.35 వేల ప్రకారం ధర పలికాయన్నారు. మల్లికా రకం మామిడి కాయలు టన్ను గరిష్టంగా రూ.48 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.30 వేలు పలికాయని తెలిపారు. ఇక హిమాయత్ రకం మామిడికాయలు టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.15 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ వెల్లడించారు.
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల
అనంతపురం: ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ కింద అడ్మిషన్లు పొందడానికి నిర్వహించిన ఏపీ ఈసెట్ (ఇంజినీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్–2026) ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 90.60 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 91.33 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 1,541 మంది అబ్బాయిలు పరీక్ష రాయగా, 1,389 మంది (90.14 శాతం), అమ్మాయిలు 736 మంది రాయగా, 674 మంది (91.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 122 మంది అబ్బాయిలు పరీక్ష రాయగా, 107 మంది (87.70 శాతం), అమ్మాయిలు 74 మంది రాయగా, 72 (97.30 శాతం) మంది అర్హత సాధించారు.
ఎంజేపీ స్కూళ్లలో
ప్రవేశాలు
ప్రశాంతి నిలయం: జిల్లాలోని 11 మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో (2026–27 విద్యా సంవత్సరం) ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. తొలివిడతలో 5వ తరగతిలో చేరేందుకు అర్హత సాధించిన విద్యార్థులు ఈ నెల 15వ తేదీ లోపు సంబంధిత పాఠశాలలో అడ్మిషన్ పొందాలని జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జమున బాయి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. విద్యార్థులు తమ వెంట అవసరమైన ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 9440111302 నంబరులో సంప్రదించాలన్నారు.


