గుత్తి: స్థానిక పీఎస్ పరిధిలో పని చేస్తున్న ముగ్గురు హోంగార్డులపై వేటుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారిని అనంతపురం హెడ్ క్వార్టర్స్లో రిపోర్టు చేయాలని శుక్రవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి. వ్యభిచార నిర్వాహకులతో సన్నితంగా ఉంటూ అవినీతి, అక్రమాలు, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే కారణంతో హెడ్ క్వార్టర్స్ను నుంచి పిలుపు వచ్చినట్లు సమాచారం.
వీఆర్వో సస్పెన్షన్
తాడిపత్రి రూరల్: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన తాడిపత్రి మండలం సజ్జలదిన్నె వీఆర్వో రామకృష్ణపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఉత్తర్వులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఈ నెల 2న జారీ చేసినట్లు తహసీల్దార్ కార్యాలయ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. ఓ రైతుకు చెందిన భూమిని ఆన్లైన్లో ఎక్కించేందుకు గత నెల 29న వీఆర్వో రామకృష్ణ రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం తెలిసిందే.
అశ్వవాహనంపై శ్రీవారు
రాయదుర్గం టౌన్: స్థానిక కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం శ్రీవారి పార్వేట ఉత్సవం, అశ్వవాహనోత్సవం కనులపండువగా సాగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా భక్తులకు వేంకటరమణస్వామి దర్శనమిచ్చారు. రాయదుర్గం రెడ్డి సంక్షేమ సంఘం, ఆరెకటిక, నాయీబ్రాహ్మణ, ఈడిగ సంఘాల ఆధ్వర్యంలో సాగిన ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, సాయంత్రం మయూర వాహన సేవలు ఉంటాయని ఈఓ నరసింహారెడ్డి తెలిపారు.


