చదువు మానేయలేక.. బాలిక ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

చదువు మానేయలేక.. బాలిక ఆత్మహత్య

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

గార్లదిన్నె: తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నం చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన రాజేశ్వరి, రామాంజనేయుల దంపతుల కుమార్తె రూపకీర్తన(17) అనంతపురంలోని వివేకానంద జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ (ఎంపీసీ) మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల రాసిన పరీక్షల్లో ఆమె ఉత్తీర్ణత సాధించింది. వేసవి సెలవులు కావడంతో ఇంటి పట్టునే ఉంటోంది. ఈ నేపథ్యంలో మంచి సంబంధం వస్తే పెళ్లి చేసేద్దామని తల్లిదండ్రులు మాట్లాడుకుంటుండగా విన్న ఆమె అందుకు అభ్యంతరం తెలిపింది. తాను చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలిపింది. దీంతో తల్లిదండ్రులు సర్ది చెప్పి ఇప్పట్లో పెళ్లి చేయబోమని, మంచి సంబంధాలు ఏమైనా ఉన్నాయోనని మాట్లాడుకుంటున్నట్లు తెలిపారు. అయినా తనకు పెళ్లి చేస్తారేమోననే భయంతో బాలిక ఈ నెల 6న ఇంట్లోనే గడ్డి నివారణకు ఉపయోగించే మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురంలోని ఓప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం బాలిక మృతి చెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు గార్లదిన్నె పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement