ప్రశాంతినిలయం: కదిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోటు చేసుకున్న భారీ అవినీతి, అక్రమాలపై విచారణకు ఆదేశించాలని కలెక్టర్ను బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి కోరారు. బుధవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ను ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. నకిలీ డాక్యుమెంట్ల దందా, రెవెన్యూ రికార్డులను అక్రమంగా తారుమారు చేయడం, ఫోర్జరీ డాక్యుమెంట్లతో అక్రమ రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తుండడం తదితర అంశాలకు సంబంధించిన ఆధారాలనూ సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కదిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చోటు చేసుకుంటున్న అక్రమాలపై గతంలో తాము ఫిర్యాదు చేసినా అధికారులు నేటికీ సరైన చర్యలు తీసుకోలేదన్నారు. ప్రభుత్వ భూములు సైతం ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తున్నారని, అసలు సూత్రధారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బూదిలి సుదర్శన్, కొండమరాజు, కత్తి రాజారెడ్డి, జ్యోతి ప్రసాద్, తిరుమలేష్, బాలగంగాధర్, కళ్యాణ్కుమార్, లక్ష్మీనారాయణ, నారాయణ, భాస్కర్ ఉన్నారు.


