మడకశిర: వ్యక్తిగత బీమా (ఇన్సూరెన్స్) కుటుంబానికి రక్షణగా నిలుస్తుందని, ఆర్టీసీ కార్మికులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలని ఆర్టీసీ కడప జోనల్ ఈడీ రాఘవకుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మడకశిర డిపోను తనిఖీ చేశారు. డిపోలోని వివిధ విభాగాలను పరిశీలించారు. సీ్త్రశక్తి పథకం అమలు తీరుపై సమీక్షించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్టీసీ అధికారులు, కార్మికులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. ఆర్టీసీ కార్మికులందరూ ఎస్బీఐ బీమా చేయించుకోవాలన్నారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమయపాలనతో ఆర్టీసీకి మంచి పేరు తీసుకుని రావాలని కోరారు. సమావేశంలో డీపీటీఓ మధుసూదన్, డీఎం ధర్మకీర్తి తదితరులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరించండి
మడకశిర డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కడప జోనల్ ఆర్టీసీ ఈడీ రాఘవకుమార్కు ఎన్ఎంయూఏ, ఈయూ నాయకులు వినతి పత్రాలను సమర్పించారు. ప్రధానంగా శ్రీశైలం బస్సు పని గంటలను సవరించాలని కోరారు. డిపో మేనేజర్ కార్యాలయం నిర్మాణానికి చొరవ తీసుకోవాన్నారు. గ్యారేజీలో బస్సుల మరమ్మతుకు అదనపు పిట్స్ ఏర్పాటు చేయాలని, సిబ్బంది, కార్మికులకు ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలని, రద్దు చేసిన బస్సు సర్వీసులను పునరుద్ధరించాలని విన్నవించారు. అనంతరం ఈడీని ఘనంగా సన్మానించారు. డీపీటీఓ మధుసూదన్, స్థానిక డీఎం ధర్మకీర్తి, ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు హనుమంతరాయప్ప, రంగప్ప, చెన్నారెడ్డి, ఉలిగమ్మ, ఈయూ డిపో అధ్యక్షుడు రఫిక్, కార్యదర్శి రంగనాథ్, రీజియన్ సభ్యుడు సిద్ధగంగప్ప, కేటీస్వామి, గంగరాజు, ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు ముద్దప్ప, కార్యదర్శి కరియప్ప, ఎన్ఎంయూ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.
ఆర్టీసీ కార్మికులు తప్పనిసరిగా బీమా చేయించుకోవాలి
ఆర్టీసీ కడప జోనల్ ఈడీ రాఘవకుమార్


