హిందూపురం:పట్టణంలోని రహమత్పూర్ సర్కిల్లో అనధికారికంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వ్యక్తిని రెవెన్యూ, పోలీసులు అరెస్టు చేశారు. ఇళ్లకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ల నుంచి హోటళ్లకు ఫ్యాక్టరీలకు సరఫరా చేసే కమర్షియల్ సిలిండర్లకు గ్యాస్ నింపి అధిక ధరలకు విక్రయాలు చేసే వ్యక్తిని రెవెన్యూ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి నిర్వహించి, అతడిని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం 25 కమర్షియల్ సిలిండర్లు, 13 డొమెస్టిక్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని డిప్యూటీ తహసీల్దార్ హారతి సీజ్ చేసి తరలించారు. ఈ అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ గోడౌన్ పక్కనే ప్రైవేట్ విద్యాసంస్థ పంచజన్య బ్రిలియంట్ స్కూల్ ఉండడం ఆందోళన కలిగించే విషయం. గోడౌన్ పక్కనే రైల్వేలైన్ ఉండటంతో నిత్యం రైళ్లు రాకపోకలు సాగుతుంటాయి. ఈమేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


