ప్రశాంతినిలయం: సత్యసాయి మహాసమాధి చెంత బుద్ద పూర్ణిమ వేడుకలు శుక్రవారం ఘనంగా సాగాయి. వేడుకల్లో బౌద్ధ ధర్మాన్ని ఆచరించే బ్రూనై, ఇండోనేషియా, జపాన్, లావో, మలేషియా, మయన్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, థైవాన్ తదితర దేశాలకు చెందిన వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వేడుకలను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు ప్రారంభించగా, బౌద్ద గురువులు వేద పఠనంతో సత్యసాయి పల్లకీ ఉత్సవాన్ని చేపట్టారు. మహాసమాధి చెంత బుద్దుని ప్రతిమకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేడుకలను ఉద్దేశించి కో–ఆర్డినేటర్ డాక్టర్ నరోత్తమ్ ఉపాధ్యాయ ప్రసంగించారు. అనంతరం భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. సాయంత్రం జరిగిన వేడుకల్లో భాగంగా నేపాల్కు చెందిన సత్యసాయి బాలవికాస్ విద్యార్థులు బుద్ద పూర్ణిమ వేడుకల ప్రాశస్త్యాన్ని చాటుతూ నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.


