కదిరి అర్బన్: ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన దక్షిణ ఆసియా గోల్షాట్ బాల్ పోటీల్లో భారత్ జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక జట్టుతో భారత్ జట్టు తలపడింది. భారత్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన కదిరి మండలం ఎరుకులవాండ్లపల్లికి చెందిన 9వ తరగతి విద్యార్థి శైలజ కీలకమైన నాలుగు గోల్స్ సాధించి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈ నేపథ్యంలో బుధవారం కదిరి రైల్వే స్టేషన్కు చేరుకున్న శైలజను ఆమె చదువుకుంటున్న హరీష్ పాఠశాల యాజమాన్యం ఘన స్వాగతం పలికింది. గోల్షాట్ బాల్ ఫౌండర్, సెక్రటరీ నోట్ల రాజేంద్రప్రసాద్, పాఠశాల ప్రిన్సిపాల్ ఎంఎస్ కిరణ్, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు. బాణాసంచా పేలుస్తూ గ్రామంలో అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.


