పుట్టపర్తి టౌన్: నవ సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని డీఎంహెచ్ఓ డాక్టర్ ఫైరోజ్ బేగం అన్నారు. సోమవారం పుట్టపర్తిలోని జానకీరామయ్య కల్యాణమంటపంలో ఏపీఎన్జీఓ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డీఎంహెచ్ఓ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన మహిళా ఉద్యోగులకు బహుమతులు అందజేసి, మాట్లాడారు. మహిళలు ఆత్మవిస్వాసంతో ముందుకు సాగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు లింగా రామ్మోహన్, రాష్ట్ర మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, సభ్యులు రమాదేవి, పరిమళ, అంజులాదేవి, నాగమణి, జయంతి, రామాంజనమ్మ, సుమలత, మానస, సూర్యనారాయణ, మురళీకృష్ణ, ఫిరోజ్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
మహిళా దొంగ అరెస్ట్
కదిరి టౌన్: వివాహిత మెడలోని బంగారు గొలుసు అపహరించిన కేసులో ఓ మహిళను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను సోమవారం వెల్లడించారు. ఖాద్రీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ప్రజా గరుడ సేవ ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆ సమయంలో భక్తుల మధ్యలో చొరబడిన ఓ ఆగంతకురాలు... ఓ వివాహిత మెడలోని 5 తులాల బంగారు చైన్తో పాటు మంగళసూత్రాన్ని అపహరించి, తన సహచరురాలుకి పంపించింది. విషయాన్ని గమనించిన భక్తులు వెంటనే మహిళను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వీఆర్ఏకు షోకాజ్
పెనుకొండ రూరల్: మునిమడుగు గ్రామానికి చెందిన వీఆర్ఏ సుబ్బరాయుడుకు అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆయన కోడి పందెం ఆడుతున్నట్లుగా ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆదివారం వైరల్ అయ్యాయి. ఇదే అంశం దినపత్రికల్లోనూ ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఆయనకు తహసీల్దార్ కె.స్వాతి సోమవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు.


