లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రొళ్ల: మండల కేంద్రంలో వెలసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం అంకురార్పణ పూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారి మూల విగ్రహానికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి సమేతంగా వెండి, బంగారు ఆభరణాలు, పూలతో విశేషంగా అలంకరించి మహా మంగళ హారతి ఇచ్చారు. ఉత్సవ విగ్రహాలతో ఆలయం చుట్టూ శాస్త్రోక్తంగా ప్రదక్షిణ చేపట్టారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని మామిడి తోరణాలు, అరటి పిలకలు, పూలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదం అందజేశారు.
నేడు కల్యాణోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం లక్ష్మీనరసింహస్వామి, లక్ష్మీదేవి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు తరలి రావాలని కోరారు.
లక్ష్మీనృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం


