‘పురం’లో శాంతి పరిఢవిల్లాలి
హిందూపురం: లౌకిక స్ఫూర్తిని చాటుతూ హిందూపురంలో శాంతి పరిఢవిల్లేలా అందరూ మత సామరస్యాన్ని చాటాలని ఏఎస్పీ అంకితా సురానా పిలుపునిచ్చారు. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు వివాదాస్పద చిత్రాలతో మత విద్వేషాలు కల్గించేలా సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపించడంతో పట్టణ పోలీసులు వెంటనే పలు ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయమే ఏఎస్పీ అంకితా సురానా హిందూపురంలో పర్యటించారు. డీఎస్పీ మహేష్తో కలిసి స్థానిక వన్టౌన్ పోలీసు స్టేషన్లో హిందూ, ముస్లిం మతపెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సోషల్ మీడియా వేదికగా ఇతర మతాలను కించపరుస్తూ రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి వారు ఎవరైనా వదిలిపెట్టబోమన్నారు. తీవ్రమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో సీఐలు రాజగోపాల్ నాయుడు, జనార్దన్, ఆంజనేయులు, అబ్దుల్కరీం ఇతర అధికారులు పాల్గొన్నారు.
పురంలో 30 పోలీస్ యాక్ట్..
హిందూపురంలో 30 పోలీస్ యాక్ట్ అమల్లోకి తీసుకువచ్చినట్లు డీఎస్పీ మహేష్ తెలిపారు. ఎక్కడా గుంపులుగా ఉండరాదని, అనుమతులు లేకుండా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించకూడదన్నారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించి సోషల్ మీడియా వేదికగా ఇబ్బందికర పోస్టులు పెట్టినా... వాటిని షేర్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వాట్సాప్ గ్రూపుల్లో ఇబ్బందికర పోస్టులు వస్తే సదరు గ్రూప్ అడ్మిన్లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి పోస్టుపై పోలీసుల నిఘా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
అందరూ సంయమనం పాటిస్తూ
శాంతియుత జీవనం సాగించాలి
మత పెద్దలకు ఏఎస్పీ
అంకితా సురానా పిలుపు


