జనగణనలో టెక్నాలజీ ఉపయోగించండి
పుట్టపర్తి అర్బన్: ‘జనగణన–2027’లో టెక్నాలజీ ఉపయోగించి సమాచారం పక్కాగా సేకరించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. జనగణనపై మూడు రోజులుగా స్థానిక సంస్కృతీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది. చివరి రోజు శిక్షణ పరిశీలనకు వచ్చిన కలెక్టర్ శ్యాంప్రసాద్ జిల్లా అధికారులనుద్దేశించి మాట్లాడారు. జనగణనలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా కచ్చితమైన గణాంకాలు సేకరించాలన్నారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి దేశ భవిష్యత్తు ప్రణాళికలకు కీలకమైన జనగణనను విజయవంతం చేయాలన్నారు. ఏపీ సెన్సెస్ ఆపరేషన్స్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆరుగురు నిపుణులు జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. జిల్లా నోడల్ ఆఫీసర్గా సూర్యవర్ధన్రెడ్డి వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లాలోని పలువురు ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.
‘ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ’ నేడు రద్దు
ప్రశాంతి నిలయం: దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా నాలుగో శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించే ‘ప్రత్యేక ఫిర్యాదుల స్వీకరణ’ కార్యక్రమాన్ని ఈనెల 27వ తేదీ (శుక్రవారం) రద్దు చేసినట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దివ్యాంగులు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదులు సమర్పించడానికి కలెక్టరేట్కు ఎవరూ రావొద్దన్నారు.


