27 నుంచి ఖాద్రీశుని బ్రహ్మోత్సవాలు
ధర్మవరం: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి మార్చి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు దేవదాయశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28న స్వామి వారి కల్యాణోత్సం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యకుమార్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 20 వేలు మంజూరు చేసిందన్నారు.
ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి
చెన్నేకొత్తపల్లి: పంట సాగు చేసిన ప్రతి రైతూ తప్పని సరిగా ఈ–పంట నమోదు చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య సూచించారు. సీకే పల్లి మండలం వెంకటాంపల్లి సమీపంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటను వ్యవసాయ శాస్త్రవేత్త రామసుబ్బయ్యతో కలసి శుక్రవారం ఆయన పరిశీలించారు. విత్తన వేరుశనగ నాణ్యతను రైతులతో అడిగి తెలుసుకున్నారు. అధిక దిగుబడులనిచ్చే మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని పంటల సాగు చేపట్టాలని సూచించారు. వేరుశనగ పంట సాగులో జిప్సంను తప్పని సరిగా వాడాలని రైతులకు శాస్త్రవేత్త రామసుబ్బయ్య సూచించారు.కార్యక్రమంలో మండల ఏఓ మురళీకృష్ణ, ఆర్ఎస్కే సిబ్బంది నాగేశ్వరి, సాయిలీల, పలువురు రైతులు పాల్గొన్నారు.


