విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దానిమ్మ తోట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దానిమ్మ తోట దగ్ధం

Jan 4 2026 6:54 AM | Updated on Jan 4 2026 6:54 AM

విద్య

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దానిమ్మ తోట దగ్ధం

కళ్యాణదుర్గం రూరల్‌: విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దానిమ్మ తోట దగ్ధమైన ఘటన మండల పరిధిలోని కోడిపల్లి వద్ద జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కోడిపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు తన మూడెకరాల పొలంలో దానిమ్మ పంట సాగు చేశాడు. పంట సాగు కోసం రూ. 5 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాడు. రెండు రోజుల క్రితం తోట వద్ద విద్యుత్‌ వైర్లు ఒకదానికొకటి తగులుకుని నిప్పురవ్వలు ఎగిశాయి. తోటలో పెరిగిన గడ్డిపై పడడంతో మంటలు రేగాయి. క్షణాల్లోనే దావానలంలా మారి దానిమ్మ చెట్లకు వ్యాపించాయి. దాదాపు 300 చెట్లు కాలిపోయాయి. దిగుబడి చేతికొచ్చే సమయంలో ఇలా జరగడంతో బాధిత రైతు లబోదిబోమంటున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.

చెరువులో పడి వ్యక్తి మృతి

ఓడీచెరువు: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో జరిగింది. ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపిన మేరకు.. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన రామారావు (35) హమాలీ కూలీగా పనిచేస్తూ భార్య మమత, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. శనివారం స్థానిక చెరువు వద్దకు బహిర్భూమి కోసం వెళ్లిన రామారావు ప్రమాదవశాత్తు చెరువు తూములో పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మహిళ బలవన్మరణం

పుట్టపర్తి అర్బన్‌: పేన్ల మందు తాగి మహిళ బలవన్మరణం పొందిన ఘటన పుట్టపర్తి మండలం పెడపల్లిలో జరిగింది. పుట్టపర్తి రూరల్‌ ఎస్‌ఐ క్రాంతి అందించిన సమాచారం మేరకు.. సంచార జాతికి చెందిన గణేష్‌, గంగమ్మ (25) దంపతులు. ఇటీవల పెడపల్లి సమీపంలో గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే గంగమ్మ అక్కడే ఉన్న పేన్ల మందు తాగింది. గణేష్‌ వెంటనే ఆమెను ధర్మవరం ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. వారికి ఏడాది వయసున్న పాప ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ద్విచక్ర వాహనాల అపహరణ

చెన్నేకొత్తపల్లి: మండల పరిధిలోని దామాజిపల్లి, చెన్నేకొత్తపల్లి గ్రామాల్లో శుక్రవారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. చెన్నేకొత్తపల్లిలో జాతీయ రహదారి సమీపంలో తన ఎలక్ట్రికల్‌ దుకాణం వద్ద నిలిపి ఉంచిన తేజారామ్‌సమర్‌ ద్విచక్ర వాహనాన్ని అర్ధరాత్రి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజీలో నమోదైంది. ఇక.. దామాజిపల్లి దళితవాడలో నరసింహులు తన ఇంటి ముందు నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుల ఫిర్యాదు మేరకు చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి.

రేషన్‌ దుకాణాలపై

విజిలెన్స్‌ దాడులు

గుడిబండ: మండల పరిధిలోని కొంకల్లు, కేఎన్‌ పల్లి, శంకరగల్లు గ్రామాల్లోని రేషన్‌ దుకాణాలపై శనివారం సాయంత్రం విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. ఆయా దుకాణాల్లో సరుకు నిల్వలు, రికార్డులను పరిశీలించారు. పేద ప్రజలకు సక్రమంగా సరుకులను అందించాలని, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీలర్లను హెచ్చరించారు. దాడుల్లో విజిలెన్స్‌ ఎస్‌ఐ నరేంద్ర, సీఎల్‌డీటీ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దానిమ్మ తోట దగ్ధం 1
1/2

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దానిమ్మ తోట దగ్ధం

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దానిమ్మ తోట దగ్ధం 2
2/2

విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో దానిమ్మ తోట దగ్ధం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement