
విప్ ధిక్కరిస్తే అనర్హత వేటు
కదిరి అర్బన్/ కదిరి టౌన్/ ప్రశాంతి నిలయం: కదిరి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 30 మంది కౌన్సిలర్లకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్ జారీ చేశారు. విప్ను ధిక్కరించిన వారిని పార్టీ నుంచి బహిష్కరించి అనర్హత వేటు వేయనున్నారు. ఈ మేరకు విప్ కాపీని మంగళవారం పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రణీత్రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు కలెక్టర్ చేతన్, ఆర్డీఓ వీవీఎస్ శర్మలకు వేర్వేరుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ మార్గంలో మున్సిపల్ చైర్పర్సన్ పీఠం చేజిక్కించుకోవడానికి టీడీపీ కుయుక్తులు పన్నుతోందన్నారు. ఇందు కోసం వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తోందన్నారు. లొంగని వారిని బెదిరింపులకు గురి చేస్తోందని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి, నిబంధనల మేరకు అవిశ్వాస తీర్మాన కార్యక్రమం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. కార్యక్రమంలో చైర్పర్సన్ పరికి నజీమున్నీసా భర్త సాధిక్, కౌన్సిలర్లు రాంప్రసాద్, ఆవుల స్వామి, మహ్మద్, నాయకులు షబ్బీర్, నూరుల్లా, షాను తదితరులు పాల్గొన్నారు.
నేడు అవిశ్వాస తీర్మానం..
కదిరి మున్సిపల్ కార్యాలయంలో బుధవారం చైర్పర్సన్ పరికి నజీమున్నీసాతో పాటు వైస్చైర్పర్సన్లు కొమ్ము గంగాదేవి, రాజశేఖరరెడ్డిలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఆర్డీఓ వెంకట సన్యాసి శర్మ వ్యవహరించనున్నారు. మున్సిపాలిటిలో 36 వార్డులు ఉన్నాయి. ఇందులో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన కౌన్సిలర్లు 30 మంది, టీడీపీ నుంచి ఐదుగురు, టీడీపీ రెబల్గా గెలిచిన ఇండిపెండెంట్ ఒకరున్నారు. సార్వత్రిక ఎన్నికల సమ యంలో వైఎస్సార్సీపీ నుంచి ఆరుగురు కౌన్సిలర్లు టీడీపీలోకి చేరారు. సంఖ్యా బలం తక్కువ ఉన్నప్పటికీ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. బెదిరింపులు, ప్రలోభాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను తమవైపు లాక్కుని బెంగళూరు క్యాంపునకు తీసుకెళ్లింది. వీరంతా బుధవారం బెంగళూరు నుంచి నేరుగా కదిరి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంటారు.
కలెక్టర్, ఆర్డీఓకు కదిరి మున్సిపల్
కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నేతల వినతి