
లేని భూమిని విక్రయించారు
పుట్టపర్తి టౌన్: భూమి లేకున్నా... రికార్డుల్లో ఉన్నట్లు చూపించి తనకు విక్రయించి మోసం చేశారని, దీనిపై తనకు న్యాయం చేయాలటూ డీఎస్పీ ఆదినారాయణకు బాధితుడు రవీంద్రనాథ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేసి తన గోడు వెల్లబోసుకున్నాడు. హిందూపురం సమీపంలోని మోతుకపల్లి రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 67–3లో ఉన్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరా విస్తీర్ణాన్ని అదే గ్రామానికి చెందిన బోయ తిమ్మయ్య 2023లో హిందూపురానికి చెందిన రవీంద్రనాథ్కు రూ..20లక్షలకు విక్రయించేలా రూ. 3 లక్షల టోకన్ అడ్వాన్స్తో ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్కు ఇప్పటి వరకూ భూమిని చూపలేదు. ఈ రోజు.. రేపు అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన రవీంద్రనాథ్ లోతుగా విచారణ చేయడంతో సదరు సర్వే నంబర్లో భూమి లేదని, మొత్తం మూడు ఎకరాలను ఇతరులకు విక్రయించినట్లుగా నిర్ధారణ కావడంతో తాను చెల్లించిన అడ్వాన్స్ వెనక్కు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ విషయంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చేసుకోవడంతో రవ్రీంనాథ్పై తిమ్మయ్య వర్గీయులు దాడిచేశారు. ఘటనపై హిందూపురం ఒకటో పట్టణ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీనిపై న్యాయం చేకూరకపోవడంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ అందజేశారు. దీనిపై స్పందించిన డీఎస్పీ ఆదినారాయణ... వెంటనే హిందూపురం డీఎస్పీ మహేష్తో ఫోన్లో మాట్లాడారు. సమస్య వివరించి, పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సూచించారు.
ఫిర్యాదులపై సత్వరమే స్పందించాలి..
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందజేసే ఫిర్యాదులపై సత్వరమే స్పందించి సరైన పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఎస్పీ రత్న ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 70 వినతులు అందాయి. ఎస్పీ రత్న స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీలు ఆదినారాయణ, విజయకుమార్, లీగల్ అడ్వైజర్ సాయినాథ్రెడ్డి పాల్గొన్నారు.
న్యాయం చేయాలంటూ
బాధితుడి వేడుకోలు
ప్రజాసమస్యల పరిష్కార వేదికకు
70 వినతులు

లేని భూమిని విక్రయించారు