
ప్రమాదంలో చిన్నారి మృతి
కొలిమిగుండ్ల: నంద్యాల జిల్లాలో కారు, బొలెరో పరస్పరం ఢీకొన్న ఘటనలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఆరుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన చంద్రమోహన్రెడ్డి తన కుమార్తె జోష్యహర్షిణిరెడ్డి(6)ని నంద్యాలలోని మేనమామ ఇంట్లో ఉంచి చదివిస్తున్నాడు. ఈ క్రమంలో అమ్మవారికి మొక్కుబడి చెల్లించాల్సి ఉండడంతో తాత, విశ్రాంత ఉపాధ్యాయుడు రామసుబ్బారెడ్డి, బంధువులు వెంకటసుబ్బారెడ్డి, ఏటూరి శ్రీనివాసరెడ్డి, లక్ష్మీదేవితో కలసి కారులో నంద్యాల స్వగ్రామానికి జోష్యహర్షిణిరెడ్డి బయలుదేరింది. కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లి శివారులోకి చేరుకోగానే అంకిరెడ్డిపల్లి నుంచి కొలిమిగుండ్లకు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ప్రమాద తీవ్రతకు కారు ఎగిరి రోడ్డు పక్కన బోల్తాపడింది. కారులో ఉన్న వారందరూ అందులో చిక్కుకుపోయారు. బొలెరో వాహనంలో ఉన్న అంకిరెడ్డిపల్లికి చెందిన యువకులు రాజకుళ్లాయి, బాలుకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు కారులో చిక్కుకుపోయిన వారిని అతి కష్టంపై వెలికితీసి, తాడిపత్రిలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న జోష్యహర్షిణిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రుడు ఏటూరి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.