
గుర్తుపెట్టుకుంటాం.. వడ్డీతో కలిపి చెల్లిస్తాం
పరిగి: ‘‘అధికారం ఎవరికీ శాశ్వతం కాదు...ఇప్పుడు మీరు చేస్తున్న దౌర్జన్యాలన్నీ గుర్తుపెట్టుకుంటాం.. త్వరలోనే వడ్డీతో కలిపి చెల్లిస్తాం’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ కూటమి నేతలను హెచ్చరించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా...ఏ రాజకీయ పార్టీ అన్యాయం చేసినా ప్రజల పక్షాన నిలబడి న్యాయపోరాటం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని, అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. శనివారం ఆమె పరిగి మండలం పైడేటిలో విలేకరులతో మాట్లాడారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కిందన్నారు. కానీ నేటి కూటమి ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చలేకపోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల వేళ అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కిన చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారన్నారు. పైగా అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలతో అమాయకులను వేధిస్తున్నారన్నారు. అందుకే కూటమి సర్కార్ దేశంలోనే అత్యంత దుర్మార్గమైన ప్రభుత్వంగా పేరు తెచ్చుకుందన్నారు. బీసీ, ఎస్సీ కార్పొరేషన్ రుణాల మంజూరులో కేవలం టీడీపీ నాయకులకు మాత్రమే వర్తింపజేసేందుకు కూటమి నేతలు అధికారులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు.
వక్ఫ్బోర్డు సవరణపై ప్రభుత్వ వైఖరి సరికాదు
ముస్లింలకు తీరని నష్టం కలిగించే వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉషశ్రీచరణ్ డిమాండ్ చేశారు. ముస్లిం, మైనార్టీలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసిన పాపానికి పశ్చాతాప పడుతున్నారన్నారు. సిద్దాంతాలను తాకట్టు పెట్టి, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మైనార్టీల గొంతుకోసిన చంద్రబాబును ముస్లింలు ఎప్పటికీ క్షమించబోరన్నారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
కూటమి నేతలను హెచ్చరించిన
ఉషశ్రీచరణ్
ఎల్లకాలం అవినీతి రాజ్యం
సాగదని వెల్లడి