
కదిరి కొండపై శ్రీవారి పాద చిహ్నాలు
కదిరి: స్వామి వారి పాదాలు తాకితే ఈ జన్మకు ఇక చాలని ఏ భక్తుడైనా కోరుకుంటాడు. ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలు తాకాలంటే కదిరి కొండకు వెళ్లాల్సిందే. శ్రీవారి పాద చిహ్నాలను తాకిన వారు పాప విముక్తులవుతారని భక్తుల నమ్మకం. అందుకే వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తాదులు కదిరి కొండపై ఉన్న నృసింహుని పాద ముద్రికలను దర్శించుకుంటున్నారు. నిర్మలమైన మనస్సుతో స్వామివారి పాదాలను తాకి, మనసులో ఆరాధిస్తే ఈతి బాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
చెరిగిపోని పాదముద్రలు..
హిరణ్య కశ్యపుడిని సంహరించేందుకు శ్రీ మహా విష్ణువు సగం మనిషి, సగం సింహం రూపంలో అంటే నరసింహావతారమెత్తారు. ఉగ్రరూపంతో స్తంభం నుంచి ఆవిర్భవించారు. హిరణ్య కశ్యపుడి సంహారం అనంతరం ఉగ్రరూపంలో ఉన్న నారసింహుని ఆ రూపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రహ్లాదుడు, దేవ దేవతలతో పాటు శ్రీదేవి, భూదేవిలు కదిరి కొండపై నుంచి ప్రార్థించారు. నృసింహుని మెప్పించేందుకు అక్కడి నుంచి వారంతా స్తోత్రం చేయడంతో స్వామి వారు అక్కడ దర్శనమిచ్చారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. అందుకే ఆ పర్వతానికి ‘స్తోత్రాద్రి’ అనే పేరు వచ్చిందని అందులో పేర్కొన్నారు. ఆ సమయంలో స్వామి వారు అక్కడ మోపిన పాదాల గుర్తులు ఇప్పటికీ చెరిగిపోలేదు. భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నాయి.

కదిరి కొండపై శ్రీవారి పాద చిహ్నాలు

కదిరి కొండపై శ్రీవారి పాద చిహ్నాలు