● ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్డు ధ్వంసం
● కలెక్టర్కు ఫిర్యాదు చేసినా,
ఏదీ ప్రయోజనం
● కోటితీర్థంలో చెలరేగిపోతున్న టీడీపీ నేతలు
చేజర్ల: మండలంలోని కోటితీర్థంలో ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారు. నిజానికి ఇక్కడ రహదారిని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. ఈ క్రమంలో కబ్జా విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతిపత్రాన్ని గ్రామస్తులు సమర్పించారు. ఈ క్రమంలో పరిష్కార నిమిత్తం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి అర్జీ వచ్చింది. ఈ తరుణంలో అధికారులు తమనేమి చేస్తారనే ధీమాతో ప్రభుత్వ భూమితో పాటు అందులో నిర్మించిన రహదారిని టీడీపీ నేతలు శనివారం తొలగించి మట్టిని పొలం చదునుకు ఉపయోగించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోరాటానికి గ్రామస్తులు సిద్ధమవుతున్నారు.


