నెల్లూరు(అర్బన్): ఉద్యోగులు హక్కులను సాధించుకునేందుకు మరోసారి జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం చేయబోతున్నామని ఏపీ జేఏసీ నెల్లూరు జిల్లా చైర్మన్ బండారుపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న ఎన్జీఓ భవన్లో ఏపీ జేఏసీ జిల్లా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 వచ్చినా ఇప్పటికీ కనీసం కమిటీ కూడా వేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడం అన్యాయమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం 12వ పీఆర్సీతోపాటు 30 శాతం ఐఆర్ను ప్రకటించాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఆర్థికేతర అంశాలైన జెడ్పీ పీఎఫ్ వెబ్సైట్ను నవీనకరించాలని కోరారు. ఏపీ జీఎల్ఐ వెబ్సైట్ను సరళీకరించాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు కిరణ్కుమార్, లక్కాకుల పెంచలయ్య, చలపతిశర్మ, దశరథరాములు, నరసింహం, ప్రసాద్, ప్రసాద్రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనయ్య, కరుణమ్మ, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.


