ఉదయగిరి రూరల్: మండలంలోని గానుగపెంటపల్లి గ్రామంలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి ఇద్దరు రైతులు సాగుచేసిన వరి పంట నేలవాలి తీవ్ర నష్టం కలిగింది. నారాయణరెడ్డికి చెందిన ఎకరా, బాలయ్యకు చెందిన 1.20 ఎకరాల్లోని పంట తడిసిపోయి నేలకొరిగింది. తాము రూ.80 వేలు పెట్టుబడి పెట్టి తెలంగాణ మసూరా రకాన్ని గతేడాది నవంబర్ నెలలో సాగు చేశామని బాధిత రైతులు తెలిపారు. మరో వారం రోజుల్లో పంట చేతికి వచ్చే దశలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో పంట మొత్తం నేలకొరిగి ధాన్యం సైతం నేలపాలైందన్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టం అందించి ఆదుకోవాలని కోరారు.


