● 40 టన్నుల స్వాధీనం
● ఒంగోలు నుంచి కృష్ణపట్నం పోర్టుకు అక్రమ రవాణా చేస్తూ..
● కోవూరులో పట్టుకున్న పోలీసులు
కోవూరు: రేషన్ బియ్యం సరిహద్దులు దాటుతోంది. అక్రమార్కులు కొత్త మార్గాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో బియ్యాన్ని పట్టుకుంటూనే ఉన్నా అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలోని కృష్ణపట్నం పోర్టుకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. వారి కథనం మేరకు.. ఒంగోలు నుంచి కావలి మీదుగా పోర్టుకు బియ్యం తరలిస్తున్నారని పోలీసులకు ముందస్తుగా సమాచారం అందడంతో నిఘా పెట్టారు. ఆదివారం అర్ధరాత్రి కోవూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న హోటల్ నెల్లూరు గ్రాండ్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో లారీని ఆపి పరిశీలించారు. అందులో 40 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. బియ్యంతో సహా లారీని కోవూరు పోలీస్స్టేషన్కు తరలించారు. సోమవారం సివిల్ సప్లయీస్ అధికారులు పోలీసుల సమక్షంలో పంచనామా నిర్వహించి బియ్యాన్ని ఇనమడుగులోని సివిల్ సప్లయీస్ గోదాముకు తరలించారు. కేసు నమోదు చేసి లారీ డ్రైవర్, క్లీనర్ను అరెస్ట్ చేశారు.
● కొంతకాలంగా నెల్లూరు మీదుగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. అధికారుల మొక్కుబడి తనిఖీల వల్లే ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. గ్రామాల్లో లబ్ధిదారుల వద్దకు వెళ్లి బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇటీవల కోవూరు ప్రాంతంలో 600 కేజీల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. తాజాగా 40 టన్నుల బయటపడటం కలకలం రేపింది.


