చరిత్ర సృష్టించిన జైస్వాల్‌.. ఐపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా.. | Yashasvi Jaiswal Creates History Becomes First Batter In IPL To Achieve This Unique Record, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన యశస్వి జైస్వాల్‌.. ఐపీఎల్‌లో తొలి ప్లేయర్‌గా..

Apr 25 2025 11:51 AM | Updated on Apr 25 2025 12:43 PM

Yashasvi Jaiswal Creates History Becomes First Batter In IPL To Achieve This

Photo Courtesy: BCCI

రాజస్తాన్‌ రాయల్స్‌ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)లో ఇంత వరకు సాధ్యం కాని రికార్డు సాధించాడు. ఎదుర్కొన్న మొదటి బంతికే మూడుసార్లు సిక్సర్‌ బాదిన ఏకైక బ్యాటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

రాయాల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌ సందర్భంగా జైస్వాల్‌ గురువారం ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా ఆర్సీబీ- రాజస్తాన్‌ (RCB vs RR) గురువారం తలపడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌.. ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

205 పరుగులు
ఓపెనర్లలో ఫిల్‌ సాల్ట్‌ (26) ఫర్వాలేదనిపించగా.. విరాట్‌ కోహ్లి (42 బంతుల్లో 70) దంచికొట్టాడు. దేవదత్‌ పడిక్కల్‌ (27 బంతుల్లో 50), టిమ్‌ డేవిడ్‌ (15 బంతుల్లో 23), జితేశ్‌ శర్మ (10 బంతుల్లో 20 నాటౌట్‌) రాణించారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు ఐదు వికెట్ల నష్టానికి 205 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.

 జైస్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌
ఇక లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసేందుకు ఆర్సీబీ సీనియర్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ రంగంలోకి దిగగా.. తొలి బంతినే జైసూ సిక్సర్‌గా మలిచాడు.

తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో ఎదుర్కొన్న మొదటి బంతికే సిక్స్‌ కొట్టిన క్రికెటర్ల జాబితాలో ఉన్న జైసూ.. మూడుసార్లు ఈ ఘనత సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ మొత్తంగా 19 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో ఏకంగా 49 పరుగులు రాబట్టాడు. అయితే, జోష్‌ హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో రొమారియో షెఫర్డ్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో అతడి అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది.

అంతేకాదు.. రాజస్తాన్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ కూడా పతనమైంది. నితీశ్‌ రాణా (28), రియాన్‌ పరాగ్‌ (22), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినా.. 20 ఓవర్లలో రాజస్తాన్‌ 194 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ చేతిలో పదకొండు పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

ఐపీఎల్‌లో తొలి బంతికే సిక్సర్లు బాదిన క్రికెటర్లు
1.యశస్వి జైస్వాల్‌- 3
2. నమన్‌ ఓజా-1
3. మయాంక్‌ అగర్వాల్‌- 1
4. సునిల్‌ నరైన్‌- 1
5. విరాట్‌ కోహ్లి- 1
6. రాబిన్‌ ఊతప్ప- 1
7. ఫిల్‌ సాల్ట్‌- 1
8. ప్రియాన్ష్‌ ఆర్య- 1.

చదవండి: ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా విరాట్‌ కోహ్లి ఘనత


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement