న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం శనివారం భారత జట్టు ఎంపిక జరగనుంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీమ్ను ప్రకటిస్తుంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్లో భారత్ 2–1తో గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో మార్పులు లేకుండా అదే జట్టును కొనసాగిస్తారా లేక ఏవైనా మార్పులు చేస్తారా అనేది చర్చనీయాంశం. వికెట్ కీపర్ స్థానం కోసం రిషభ్ పంత్ పేరును పరిశీలిస్తారా అనేది ఆసక్తికరం. చాలా కాలంగా వన్డేల్లో కేఎల్ రాహుల్ ప్రధాన కీపర్గా కొనసాగుతున్నాడు. గత సిరీస్లో పంత్, జురేల్ జట్టులో ఉన్నా వీరికి మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు.
దేశీ క్రికెట్లో హీరోగా ఇషాన్ కిషన్
ఇప్పటికే వన్డే తుది జట్టులో పంత్కు చోటు కష్టంగా మారగా...ఇప్పుడు బయటి నుంచి ఇషాన్ కిషన్ రూపంలో పోటీ ఎదురవుతోంది. దేశవాళీ క్రికెట్లో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ సత్తా చాటగా...యూపీ తరఫున జురేల్ కూడా రాణిస్తున్నాడు. మరో వైపు పంత్ వరుసగా విఫలమయ్యాడు.
నిజానికి గంభీర్ కోచ్గా వచ్చాక చూస్తే జులై 2024 నుంచి ఇప్పటి వరకు పంత్ ఒకే ఒక్క వన్డే ఆడాడు! ఏడేళ్ల కెరీర్లో అతను ఆడినవి 31 వన్డేలే కాగా...బ్యాటింగ్లో 34 సగటు చెప్పుకోదగ్గది కాదు. ఇలాంటి స్థితిలో పంత్కు మరిన్ని అవకాశాలు ఇస్తారా లేక పక్కన పెడతారా చూడాలి.
సిరాజ్ను ఎంపిక చేస్తారా?
మరో వైపు పేస్ బౌలర్ ఎంపికపై కూడా చర్చ నెలకొంది. హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ను తగిన కారణం లేకుండా సెలక్టర్లు వన్డేల నుంచి పక్కన పెడుతూ వస్తున్నారు. చాంపియన్స్ ట్రోఫీలో అవకాశం దక్కని అతను ఆ తర్వాత ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడాడు. అయితే స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్కు సిరాజ్ను మళ్లీ ఎంపిక చేయలేదు.
విజయ్హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్లలో సిరాజ్ బరిలోకి దిగలేదు. టీ20 ప్రపంచ కప్ను దృష్టిలో పెట్టుకొని హార్దిక్ పాండ్యా, బుమ్రాలకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. మరో ఇద్దరు పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్లను కూడా పక్కన పెట్టి సిరాజ్ను ఎంపిక చేస్తారా అనేది ఆసక్తికరం.
షమీ విషయంలో యూటర్న్?
సీనియర్ పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. దేశవాళీలో అతను అన్ని ఫార్మాట్లలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నా... షమీ అంతర్జాతీయ స్థాయిలో తన అత్యుత్తమ దశను దాటేశాడనేది సెలక్టర్ల అభిప్రాయంలా కనిపిస్తోంది. బ్యాటింగ్లో చూస్తే మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ తన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు.
అయితే దక్షిణాఫ్రికాతో సెంచరీతో రుతురాజ్ తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నట్లే. ఓపెనర్గా గిల్, రోహిత్, జైస్వాల్ల స్థానాలకు ఢోకా లేదు కాబట్టి విజయ్హజారేలో సత్తా చాటుతున్న పడిక్కల్కు కూడా చోటు కష్టమే.
చదవండి: IPL 2026: రాజస్తాన్ రాయల్స్ ‘ఫ్యాన్స్’కి భారీ షాక్!


