ఇషాన్‌ కిషన్‌కు అండగా విరాట్‌ కోహ్లి | Ishan Kishan Reveals Emotional Journey About His Tough Phase Of Career, Says Virat Kohli's Advice Helped Me Bounce Back | Sakshi
Sakshi News home page

ఇషాన్‌ కిషన్‌కు అండగా విరాట్‌ కోహ్లి

Feb 4 2026 8:34 AM | Updated on Feb 4 2026 9:52 AM

Virat Kohli stood by a broken Ishan Kishan, heartbreaking incident revealed

న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో అనూహ్యంగా జట్టులోకి వచ్చి అద్భుతాలు చేసిన టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఒకనొక దశలో మానసికంగా కృంగిపోయి ఉన్నప్పుడు టీమిండియా దిగ్గజం​ విరాట్‌ కోహ్లి తనకు అండగా నిలబడ్డాడని గుర్తు చేసుకున్నాడు. ఆ క్షణాలు జీవితంలో మరిచిపోలేనివని అన్నాడు. విరాట్‌ ఓదార్పు తనను కెరీర్‌లో తిరిగి పుంజుకునేలా చేసిందని తెలిపాడు.

మానసికంగా విరిగిపోయిన సమయం
ఇషాన్‌ 2020 ఐపీఎల్‌ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున 516 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. కానీ 2021లో పరిస్థితి పూర్తిగా మారింది. 10 మ్యాచ్‌ల్లో కేవలం 241 పరుగులు మాత్రమే సాధించాడు. అతని ఆటలో ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో వ్యాఖ్యాత ఇయాన్ బిషప్‌ అతన్ని “బ్రోకెన్ యంగ్ మాన్” అని వ్యాఖ్యానించారు.  

విరాట్ కోహ్లీ ఇచ్చిన మానసిక బలం  
ఆ సమయంలో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌ తర్వాత విరాట్ కోహ్లీ ఇషాన్‌ దగ్గరకు వెళ్లి మాట్లాడాడు. ఆ క్షణం ఇషాన్‌ జీవితంలో మరపురాని అనుభవంగా నిలిచింది. “నేను కన్నీళ్లు ఆపుకుంటూ ఉన్నాను. విరాట్‌ భాయ్‌ వచ్చి నన్ను ఓదార్చారు. ఆ సమయంలో నాకు ఆ మాటలు చాలా అవసరం అయ్యాయి” అని ఇషాన్‌ ఇటీవల ఒక పోడ్‌కాస్ట్‌లో చెప్పాడు.  

బాధను విజయంగా మార్చిన క్షణం  
విధి చాలా నాటకీయమైంది. 2022లో ఇషాన్‌ కిషన్‌ 121 బంతుల్లో డబుల్ సెంచరీ (ఫాస్టెస్ట్‌) సాధించినప్పుడు, నాన్‌-స్ట్రైకర్‌ ఎండ్‌లో నిలిచింది విరాట్ కోహ్లీనే. ఇద్దరూ కలిసి 290 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత జట్టుకు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఒకప్పుడు కన్నీళ్లు ఆపుకున్న ఆటగాడు, అదే కోహ్లీ సాక్షిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

నమ్మకముంచిన ముంబై ఇండియన్స్‌  
ఇషాన్‌ 2021లో విఫలమైనప్పటికీ, ముంబై ఇండియన్స్‌ అతనిపై నమ్మకముంచింది. 2022 వేలంలో రూ. 15.25 కోట్ల భారీ మొత్తానికి అతన్ని తిరిగి కొనుగోలు చేసింది. ఎంఐ విశ్వాసాన్ని ఇషాన్‌ నిలబెట్టుకున్నాడు. ఆ ఎడిషన్‌లో 14 ఇన్నింగ్స్‌ల్లో 133.88 స్ట్రైక్‌రేట్‌తో 418 పరుగులు చేసి, ముంబై ఇండియన్స్‌ తరఫున అత్యంత విలువైన ఆటగాడిగా నిలిచాడు.

ఇషాన్  2.0
ఐపీఎల్‌ అనుభవాలు పక్కన పెడితే, ఇషాన్‌ అంతర్జాతీయ కెరీర్‌లోనూ అద్భుతమైన పునరాగమనం చేశాడు. రెండేళ్ల కిందట అతనికి టీమిండియాలో స్థానమే ఉండేది కాదు. స్వయంకృతాపరాధాల వల్ల జట్టులో స్థానం కోల్పోవడంతో పాటు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కూడా కోల్పోయాడు. అయితే ఇషాన్‌ తిరిగి అద్భుత రీతిలో పుంజుకున్నాడు.

గడిచిన రెండేళ్లలో దేశీయ క్రికెట్‌లో విశేషంగా రాణించి, ఇటీవల న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌కు అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. ఈ వెర్షన్‌ ఇషాన్‌లోని 2.0 వెర్షన్‌. రీఎంట్రీలో ఇషాన్‌ మరింత చెలరేగిపోయాడు. మొదటి మూడు మ్యాచ్‌ల్లోనే వరుసగా 76, 28, 103 పరుగుల స్కోర్లు చేశాడు. ఈ ప్రదర్శనల తర్వాత అతను త్వరలో ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్‌ చేయడం ఖరారైపోయింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement